భార్యపై కక్ష పెంచుకున్న ఓ భర్త ఎలాగైనా ఆమెపై పగతీర్చుకోవాలని భావించాడు. భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని ఓ డేటింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడమేకాక ఆమె ఫోన్ నంబర్ కూడా పెట్టేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం… శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన వినయ్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో వీడియో ఎడిటర్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్యతో విభేదాలు పొడచూపాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాగైనా భార్యపై కక్ష తీర్చుకోవాలని భావించిన వినయ్ తన క్రిమినల్ బ్రెయిన్కు పదునుపెట్టాడు. వీడియో ఎడిటర్గా అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో తన భార్య ఫోటోలను మార్ఫింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ఫోటోలను ఎడిట్ చేసి.. పక్కన మరో యువకుడు ఉన్నట్లు మార్చేశాడు. ఆ ఫోటోను డేటింగ్ వెబ్సైట్లో పోస్ట్ చేసి.. ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు.
దీంతో ఆమెకు ఎవరెవరి నుంచో కాల్స్ వచ్చేవి. ఫోన్ చేసిన వారు అసభ్యంగా మాట్లాడుతుండడంతో ఆమె షాకయ్యింది. వెంటనే విషయాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకురాగా, వారు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. చివరికి తమ దర్యాప్తులో ఆమె భర్త వినయ్ నిందితుడిని వారు తేల్చారు. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తానే తన భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్లో పెట్టానని అతడు అంగీకరించాడు. దీంతో అతడ్నిఅరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.