హైదరాబాద్: ‘పబ్జీ’ ఈ పేరు వింటేనే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ గేమ్ కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులతోపాటు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఈ గేమ్కు బానిసగా మారిన ఓ పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం ఆందోళనకరంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి సీఐ మన్మోహన్, ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాలకూరి భరత్రాజ్, ఉమాదేవి మల్కాజిగిరి విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. లాహిరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, సాంబశివ(16) ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు.
బుధవారం ఆఖరి పరీక్ష రాయాల్సి ఉంది. సోమవారం రాత్రి తల్లి సెల్ఫోన్ తీసుకుని పబ్జీ గేమ్ ఆడుకుంటూ కనిపించాడు. చివరి పరీక్ష పూర్తయ్యేవరకు ఇలాంటి ఆటలకు దూరంగా ఉండాలని తల్లి గట్టిగా మందలించింది. అయితే, ఈ మందలింపే తమకు కొడుకును దూరం చేస్తుందని ఆమె ఊహించలేదు.
తల్లి మందలించిందనే..
అమ్మ తిట్టిందని మనస్తాపానికి గురైన బాలుడు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అరగంట తర్వాత కొడుకు ఏం చేస్తున్నాడోనని తల్లి గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. లోపల గడియ పెట్టి ఉండటంతో కిటికీలోనుంచి చూసింది. సాంబశివ అచేతనంగా కిందపడి ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురైంది.
స్థానికుల సహాయంతో గది తలుపులు విరగ్గొట్టి అతడిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే సాంబశివ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతడు తువ్వాలుతో ఉరేసుకున్నాడని, బాలుడు బరువు ఎక్కువగా ఉండటంతో తువ్వాలు ఊడి కిందపడిపోయాడని భావిస్తున్నారు. ఈ మేరకు ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాంబశివ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.








