హైదరాబాద్: ‘బాహుబలి’ సిరీస్తో భారతీయ సినీ రంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ సినిమా విడుదలైన ప్రతిచోట ప్రభంజనం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా మరే భారతీయ చిత్రానికి రానన్ని అవార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇక రాజమౌళికి దక్కిన ప్రశంసల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ చిత్రానికి ఆయన ఎంత కష్టపడ్డారో తెలియంది కాదు. కానీ ఈ సినిమాకు రాజమౌళి కంటే ఎక్కువగా కష్టపడిన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే రాజమౌళి కుమారుడు కార్తికేయ. ఈ విషయాన్ని రాజమౌళియే ఎన్నో ఇంటర్వ్యూల్లో తెలియజేశారు.
ఇక అసలు విషయానికొస్తే.. రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ డిసెంబర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి ప్రేయసి పూజా ప్రసాద్ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. పూజా.. ప్రముఖ నటుడు జగపతిబాబు బంధువైన రామ్ ప్రసాద్ కుమార్తె.
కార్తికేయ, పూజాల వివాహం ఈ డిసెంబర్ 30న పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని జైపూర్లో జరగనుంది. 250 ఎకరాల్లో బాహుబలి తరహా సెట్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పెళ్లికి టాలీవుడ్తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అతిథుల కోసం సెవన్ స్టార్ హోటల్ను బుక్ చేశారట. సినిమా అయినా, నిజ జీవితమైనా తన ఆలోచనలు భారీగానే ఉంటాయని రాజమౌళి మరోసారి నిరూపిస్తున్నారు.