
హైదరాబాద్: రాజకీయాల్లోకి వెళ్లి సినిమాను పక్కనపెట్టేసిన పవన్ కల్యాణ్ తాజాగా మళ్లీ సినిమాలపై బిజీ అవుతున్నారు. ఇటీవల ఆయన వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు బిజీ షెడ్యూల్స్ లో తీరిక లేకుండా గడిపారు.
అయితే, ఊహించని విధంగా కరోనా మహమ్మారి వీరవిహారం చేయడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడింది. తాజాగా పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి వెల్లడించారు.
ప్రస్తుతం షూటింగ్ చేసే పరిస్థితులు లేవని, సినిమాల షూటింగులకు కరోనా వైరస్ ఆటంకంగా ఉందన్నారు. మహమ్మారి వైరస్ ఎవరికి సోకినా ప్రమాదమేనని అన్నారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి. జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరో వైపు షూటింగులలో పాల్గొంటూ వచ్చారు.
అయితే, కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
కరోనా కారణంగా సినిమాలన్నీ ఆగిపోయాయని, అవి తిరిగి ఎప్పుడు మొదలవుతాయో తెలియదని అన్నారు. తొందరపడి షూటింగులకు వెళ్తే కష్టమేనన్నారు.
ఇటీవల కొందరు ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారని, అనుమతులు ఇచ్చినా షూటింగులు చేసే పరిస్థితి లేదన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనే టీకా వచ్చే వరకు నిస్సహాయతతో వేచి చూడడం తప్ప మరో మార్గం లేదని పవన్ వివరించారు.








