వాషింగ్టన్: గ్రీన్కార్డు కోసం వేచి ఉన్న, అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త వినిపించారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో సరికొత్త మార్పులకు ప్రతిపాదించడం ద్వారా ట్రంప్ వలసదారులకు భారీ ఊరట కల్పించనున్నారు. గ్రీన్కార్డు జారీలో కుటుంబ సంబంధాలకు కాకుండా నైపుణ్యం ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం 66శాతం కుటుంబ సంబంధాలు ద్వారా ( గ్రీన్కార్డు పొందిన వారు తమ కుటుంబ సభ్యులను, పెళ్లికాని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను స్పాన్సర్ చేయడం) 12 శాతం మాత్రమే నైపుణ్యం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇకమీదట ట్రంప్ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికి మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
గ్రీన్కార్డుల స్థానంలో…
అమెరికా ఏటా లక్షా నలభై వేల గ్రీన్కార్డులు జారీ చేస్తోంది. కెనడా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల తరహాలో అమెరికాలోనూ కొత్త వలస విధానంలో భాగంగా పాయింట్లు కేటాయిస్తామని, విదేశీయులకు అమెరికాలో జారీ చేస్తున్న గ్రీన్కార్డుల స్థానంలో ‘బిల్డ్ అమెరికా’ వీసాలను తెస్తామని డొనాల్డ్ ట్రంప్ వివరించారు.
ఫలితంగా హెచ్1బీ వీసా పొంది దశాబ్ద కాలంగా గ్రీన్కార్డు కోసం ఎదురు చూస్తున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలగనుంది.
ఇక ప్రపంచ దేశాలతో పోటీ…
‘‘ప్రస్తుతం అమెరికా వలసవిధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యుత్తమ కళాశాలల్లో మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులకు కూడా ఓ డాక్టర్గా, పరిశోధకుడిగా, విద్యార్థిగా మనం అవకాశం ఇవ్వలేకపోతున్నాం.
కొత్త వలస విధానం కింద అభ్యర్థుల వయసు, నైపుణ్యం, ప్రతిభ, ఉద్యోగ అవకాశాలు, అమెరికా రాజ్యాంగం, ప్రభుత్వ పనితీరు, చరిత్రపై అవగాహన, ఇంగ్లిష్లో తప్పనిసరి ఉత్తీర్ణత ఆధారంగా పాయింట్లు కేటాయిస్తాం. ఈ కొత్తవిధానం ఓసారి ఆమోదం పొందితే నైపుణ్యవంతుల్ని ఆకర్షించే విషయంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది..’’ అని ట్రంప్ వెల్లడించారు.
ఇక త్వరితగతిన గ్రీన్ కార్డులు…
ప్రస్తుతం గ్రీన్కార్డు కోసం ఒక్కో భారతీయుడు పదేళ్ల పాటు వేచిచూడాల్సి వస్తోంది. కొత్తవిధానంలో వీరందరికీ త్వరితగతిన గ్రీన్కార్డులు మంజూరవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త వలస విధానంలో నైపుణ్యవంతులైన విదేశీ కార్మికులకు గ్రీన్కార్డుల్లో 57 శాతం కేటాయిస్తామని ట్రంప్ ప్రకటించడం కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.
కొత్త వలసవిధానం కారణంగా లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు గ్రీన్కార్డు లభిస్తుందని పేర్కొన్నారు. గ్రీన్కార్డుల కోటాను అవసరమైతే 57 శాతానికి మించి పెంచుతామనీ, అదే సమయంలో ఏటా జారీచేస్తున్న గ్రీన్కార్డుల సంఖ్యను తగ్గించబోమని ట్రంప్ ప్రకటించడాన్ని కూడా వీరు స్వాగతించారు.
మిశ్రమ స్పందన…
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నూతన వలస విధానంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతినిధుల సభలో హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ సభ్యుడు మైక్ రోజర్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనివల్ల సరిహద్దు భద్రత పటిష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సెనేట్లో మైనారిటీ నేత చక్ స్చుమెర్ మాత్రం ట్రంప్ ప్రకటించిన కొత్త విధానం వలసలకు వ్యతిరేకమనీ, ఇది కేవలం రాజకీయ జిమ్మిక్కు తప్ప మరేమీకాదని విమర్శించారు. నూతన విధానంలో దూరదృష్టి కొరవడిందని ఇండో–అమెరికన్, సెనెటర్ కమలా హ్యారిస్ కూడా పెదవివిరిచారు. ఆసియా సంతతి ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వలస వెళతారని హ్యారిస్ గుర్తుచేశారు.