బెంగళూరు: దేశ వ్యాప్తంగా బలంగా వీచిన మోడీ వేవ్లో తలపండిన రాజకీయ నేతలు ఓటమి పాలైన విషయం తెల్సిందే. ఇక ఈ మోడీ వేవ్కి మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.
కర్నాటకలోని తూముకూరు నుంచి జెడీఎస్ నుంచి పోటీ చేసిన దేవెగౌడ తన సమీప బీజేపీ అభ్యర్ధి బసవరాజ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఓటమిపై దేవెగౌడ ఈరోజు స్పందించారు. ఇది తొలి ఓటమి కాదని, రెండు సార్లు ఓడిపోయానని చెప్పారు.
మాజీ ప్రధానిని అయినంత మాత్రాన ఓడిపోకూడదనే రూల్ లేదని, ఇందుకు కారణాలు కూడా మీతో పంచుకోలేనని అన్నారు. ఓటమిపై ఎవరినీ నిందించనని, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.
కాగా, మనుమడు ప్రజ్వల రేవణ్ణ రాజకీయ అరంగేట్రం కోసం తన కంచుకోట హసన్ దాటి బయటకొచ్చినా దేవెగౌడకు పరాభవం తప్పలేదు. అయితే తాత ఓడిపోవడంతో ప్రజ్వల్ రాజీనామాకి సిద్ధపడ్డారు. తన స్థానంలో మళ్ళీ దేవెగౌడని పోటీ చేయాలని కోరారు. కానీ దీన్ని దేవెగౌడ తిరస్కరించారు.