విజమవాడ: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో వెయిటర్ శ్రీనివాసరావు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి జరిగిన వెంటనే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లిన జగన్ అక్కడ సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.
చదవండి: షాకింగ్: వైఎస్ జగన్పై హత్యాయత్నం, కోడి పందేలకు వాడే కత్తితో దాడి…
దాడి జరిగి పది రోజులు అవుతున్నప్పటికీ జగన్ భుజానికి అయిన గాయం పూర్తిగా నయం కాలేదు. అయినప్పటికీ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వైద్యులు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెబుతున్నప్పటికీ పాదయాత్ర కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం నుంచి జరిగే వైఎస్ జగన్ పాదయాత్రకు భద్రత మరింత పెంచేలా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్టేట్ మెంట్ ఇవ్వాల్సిందిగా కోరాము: ఏపీ డీజీపీ
జగన్పై దాడి కేసుకు సంబంధించి విచారణలో తన స్టేట్ మెంట్ ఇవ్వాల్సిందిగా ఇప్పటికి రెండుసార్లు జగన్ని కోరామని.. కానీ ఆయన అందుకు అంగీకరించలేదని, మరోసారి ఇదే విషయం ఆయనను కోరతామని డీజీపీ చెప్పారు. జగన్ స్టేట్ మెంట్ ఇస్తే విచారణ సులువవుతుందని ఆయన పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపు.. విచారణ అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం దాడి కేసులో విచారణ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వివరించారు.