పెప్సీకోకు ఇంద్రా నూయి గుడ్‌బై.. కొత్త సీఈవోగా రామోన్‌ లగౌర్తా, ఇక చైర్‌పర్సన్‌గా…

indra-nooyi
- Advertisement -

indra-nooyi

వాషింగ్టన్: న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న దిగ్గజ శీతల పానీయాల సంస్థ పెప్సీకో సీఈవోగా సుదీర్ఘ కాలం సేవలందించిన భారతీయ వనిత ఇంద్రా నూయి (62) ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు.  12 ఏళ్లుగా సీఈవోగా పనిచేస్తున్న ఇంద్రా నూయి అక్టోబర్ 3న ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆమె తర్వాత పెప్సీకో  సీఈవోగా రామోన్‌ లగౌర్తా (54) పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  రామోన్‌ లగౌర్తా ప్రస్తుతం పెప్సీకో అధ్యక్షుడిగా ఉన్నారు.

తొలి మహిళా సీఈవోగా…

ఐఐఎం, కోల్‌కతా నుంచి ఎంబీఏ పట్టా పొందిన ఇంద్రా నూయి 1994లో పెప్సీకోలో చేరారు. 2006లో సీఈవో అయ్యారు. 62 ఏళ్ల ఇంద్రా నూయి పెప్సీకో సంస్థలో 24 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అందులో చివరి 12 ఏళ్లు సీఈవోగా సేవలందించారు. పెప్సీకో సంస్థల్లో తొలి మహిళా సీఈవోగా ఆమె చరిత్ర సృష్టించారు.
ఇది నాకు మాత్రమే దక్కిన గొప్ప గౌరవం…

‘‘పెప్సీకో సీఈవోగా దాదాపు 12 ఏళ్లు పనిచేశా. నా జీవిత కాలంలో ఇలాంటి అవకాశాన్ని నేనెప్పుడూ ఊహించలేదు. ఇంతకంటే గొప్ప గౌరవం ఉండదని భావిస్తున్నా. నా పదవికి న్యాయం చేశాననే అనుకుంటున్నా. పెప్సీకో ప్రస్తుతం సరైన స్థితిలోనే ఉంది. భవిష్యత్తులో ఇంతకంటే మంచి స్థానంలో ఉంటుంది. సీఈవోగా నా బాధ్యతను ప్రభావవంతంగా నిర్వహించడంలో నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు..’’ అని ఇంద్రా నూయి పేర్కొన్నారు.

2019 వరకు ఛైర్‌పర్సన్‌ హోదాలో…

పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయి తనదైన పనితీరుతో ఎన్నో విజయాలు, మరెన్నో అవార్డులు అందుకున్నారు. తన పదవికాలంలో పెప్సీకోలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపిన ఆమె.. ప్రస్తుతం ఇండియాలో శీతల పానీయాల వ్యాపారం ఊపందుకుంటోందని పేర్కొన్నారు.  సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ ఇంద్రా నూయీ 2019 వరకు పెప్సీకో సంస్థకు ఛైర్‌పర్సన్‌గా సేవలు అందించనున్నారు.

- Advertisement -