ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద ఒక్కరోజులో(సెప్టెంబర్3) భారీగా పెరిగింది. ఈ భారతీయ కుబేరుడు అసియాలోనే అత్యంత ధనవంతుడన్న విషయం తెలిసిందే.
తాజాగా ముఖేష్ సంపద శుక్రవారం 3.71 బిలియన్ డాలర్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర పెరగడమే దీనికి కారణం.
దీంతో ప్రస్తుతం ముఖేష్ అంబానీ 100 బిలియన్ డాలర్ల నికర విలువ సంపదతో కూడిన ‘బిలియనీర్ల ప్రత్యేక క్లబ్’లో ప్రవేశించడానికి అత్యంత సమీపంలో ఉన్నారు.
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం… ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. అంబానీ నికర ఆస్తుల విలువ పస్తుతం 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
సోమవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధర 1.70 శాతం పెరిగింది. దీంతో ఈ కంపెనీ షేర్ ధర ప్రస్తుతం రూ.2,429.00 వద్ద ఉంది.
గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్లో రూ.393 కోట్ల వాటాను రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.
రిలయన్స్ నియంత్రణలోకి ‘జస్ట్ డయల్’…
అంతేకాదు, ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లోకల్ సెర్చి ఇంజిన్ ‘జస్ట్ డయల్’లో 40.95% వాటాలు కొనుగోలు చేసింది.
సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా ‘జస్ట్ డయల్ లిమిటెడ్’పై నియంత్రణ కూడా తీసుకున్నట్లు తెలిపింది.
ఇక అతి తక్కువ టారిఫ్లతో ఇంటర్నెట్ అందిస్తూ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తోన్న జియో ఇన్ఫోకామ్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద వైర్లెస్ సర్వీస్ ప్రొవైడర్.
రిలయన్స్ గ్రూప్ సంస్థలలో ఒకటైన జియో ఇన్ఫోకామ్ 2021, జూన్ నెల చివరి నాటికే 43.66 కోట్ల మంది చందాదారులను కలిగి ఉంది.