

మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్ పర్యటనలో అటు టీమిండియా పురుషుల జట్టు.. ఇటు మహిళల జట్టు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా పురుషుల జట్టు 3-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకోగా.. ఇప్పుడు మహిళల జట్టు కూడా 2-0తో మూడు వన్డేల సిరీస్ను సొంతం చేసుకుంది.
సోమవారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ను మట్టికరిపించి కోహ్లీసేన వన్డే సిరీస్ను సొంతం చేసున్న విషయం తెలిసిందే. మంగళవారం మిథాలీ సేన కూడా కివీస్ జట్టుపై రెండో వన్డే గెలిచి 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ అమ్మాయిల మధ్య మంగళవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మిథాలీ సేన అద్భుతమైన బౌలింగ్తో కివీస్ జట్టును 161 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు.. ఆరంభంలో కాస్త తడబడింది. తొలి ఐదు ఓవర్లలోనే ఒపెనర్ జెమిమా రోడ్రిగ్స్(0), దీప్తి శర్మ(8) ఔటయ్యారు.
కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మంధాన, మిథాలీ
ఆ తర్వాత మైదనంలోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్, ఓపెనర్ స్మృతి మంధాన క్రీజులో కుదురుకుని కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ వన్డేలో స్మృతి(90), మిథాలీ(63) కలిసి 151 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు.
భారత్ 35.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. అటు తొలి వన్డేలోనూ భారత్ గెలుపొందడంతో మరో వన్డే మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ను సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్మృతీ మంధానను వరించింది. అయితే, న్యూజిలాండ్ జట్టుకు ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా చేసిన భారత బౌలర్లకు కూడా ఈ అవార్డులో భాగస్వామ్యం ఉందని మంధాన మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తెలిపింది.
సంబంధిత వార్తలు








