జకార్తా: ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 1-0 తేడాతో చైనాపై గెలిచి ఫైనల్స్కు చేరుకుంది. నేటి మ్యాచ్లో ఒకే ఒక్క గోల్ నమోదైంది. అదీ టీమిండియా స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్(52వ నిమిషంలో) సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
ఏషియన్ గేమ్స్లో భారత మహిళల జట్టు ఫైనల్కు చేరుకోవడం ఇది మూడోసారి కాగా, 1998 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఫైనల్ పోరులో ఈ నెల 31న (శుక్రవారం) భారత జట్టు జపాన్తో తలపడనుంది.
బుధవారం నాటి సెమీఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరుజట్ల ఢిపెన్స్ బలంగా ఉండటంతో గోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో మూడు క్వార్టర్స్ ముగిసినా ఒక్క గోల్ నమోదు కాలేదు. మరో ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ రూపంలో భారత జట్టుకు అదృష్టం వరించింది.
వచ్చిన అవకాశాన్ని మిస్ చేయకుండా భారత స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్ చైనా గోల్కీపర్ను బోల్తా కొట్టించి గోల్ సాధించింది. ఇక ఆట ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాకపోవడంతో టీమిండియా విజయం సాధించింది.