
హైదరాబాద్: డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సరికొత్త వ్యూహాలని అమలు చేస్తూ టెక్నాలజీని వాడుకుంటున్నారు.
రోజుకు రెండు మూడు సిమ్ కార్డులు చొప్పున 12 రోజుల్లో 30 సిమ్ కార్డులను మార్చినట్టు పోలీసులు గుర్తించారు. టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన ఈ నెల 9వ తేదీ నుంచి ఇప్పటివరకు 30 సిమ్లు మార్చారని సమాచారం.
చదవండి: రవిప్రకాశ్, శివాజీపై లుకౌట్ నోటీసులు జారీచేసిన పోలీసులు!
టెక్నాలజీ పరంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ సైతం ఇంతవరకూ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తనపై దాఖలైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ను ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.








