
హైదరాబాద్: ఇప్పటికే ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై మరో కేసు నమోదైంది. టీవీ9 చానల్ లోగో సహా ఆరు లోగోలను తన సొంత వెబ్ చానల్ మోజో టీవీకి రవిప్రకాశ్ అమ్మేశారంటూ… ఏబీసీపీఎల్ డైరెక్టర్ కౌశిక్రావు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
చదవండి: అవసరమైతే కొత్త చానల్ని పెడతానంటున్న రవి ప్రకాశ్…
ఇక రవిప్రకాశ్తో కలిసి వీకేఎన్ మూర్తి, హరికిరణ్ చేరెడ్డిలు కూడా టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.99 వేలకు విక్రయించారని కౌశిక్రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీవీ9 లోగోలు అమ్మినందుకు ప్రతిగా రావాల్సిన రూ.99 వేలను మీడియా నెక్ట్స్ ఇండియా నుంచి ఏబీసీపీఎల్కు బదిలీ చేశారని వివరించారు. అయితే, ఆ సొమ్మును ‘అదర్ రిపెయిర్స్ అండ్ మెయింటెనెన్స్’గా పేర్కొన్నారని కౌశిక్ రావు తెలిపారు.
ఇలా కోట్ల రూపాయల విలువచేసే లోగోలను రవిప్రకాశ్ అక్రమంగా, దురుద్దేశపూర్వకంగా, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించేలా విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.








