

జడ్చర్ల: తెలంగాణని ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు ‘వదల బొమ్మాళీ వదల’ అంటున్నాడని తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లడుగుతారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
బుధవారం ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడారు. మహాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు మళ్ళీ తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నలు చేస్తున్నారని, పాలమూరు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ కోరారు.
బాబు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రే…
తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కేవలం పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రే అంటూ కేసీఆర్ చెప్పారు.
ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 35 కేసులు వేశారని, నాగం జనార్ధన్ రెడ్డితో పాటు పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు ఈ ప్రాజెక్టుపై కేసులు వేశారని కేసీఆర్ తెలిపారు.
9 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారు?
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను వలస జిల్లాగా మార్చాడని, ఇప్పుడు మళ్లీ తెలంగాణలో జోక్యం చేసుకుంటూ ఉడుముల్లా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.
పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీటిని ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే నాలుగేళ్లలో వేల కోట్లతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు.








