26.1 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ‘కరోనా’ ఎఫెక్ట్: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. స్కూల్స్, మాల్స్, సినిమా హాల్స్ క్లోజ్!

‘కరోనా’ ఎఫెక్ట్: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. స్కూల్స్, మాల్స్, సినిమా హాల్స్ క్లోజ్!

corona-virus-telangana-cm-kcr-key-decesion
- Advertisement -

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ‘కరోనా’పై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా స్కూల్స్, మాల్స్, సినిమా హాల్స్‌ను కూడా మూసివేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలోనే ఆ పరీక్షలను మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తారని, అలాగే పదో తరగతి పరీక్షలను కూడా షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారని తెలిపారు.

అప్రమత్తమైన ప్రభుత్వం…

తెలంగాణలో ఇప్పటికే రెండు కరోనా కేసులు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా వైరస్‌ లక్షణాలు కనిపించిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

మరోవైపు కర్ణాటకకు చెందిన కరోనా పాజిటివ్ వ్యక్తి ఒకరు చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ…

కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్టాలు సైతం పాఠశాలలు, మాల్స్‌ మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ముంబైలో థియేటర్లు, మాల్స్‌ మూసివేశారు. గోవాలో మార్చి 31 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక కర్ణాటకలో అయితే వారం రోజులపాటు మాల్స్‌, థియేటర్లు, స్కూల్స్‌, కాలేజీలు బంద్‌ చేశారు.

అలాగే బీహార్‌లో మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌ అయ్యాయి. ఢిల్లీలోనూ మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేశారు. రాజస్థాన్‌లో ఈనెల 30 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. యూపీలో అయితే మార్చి 22 వరకు మాత్రమే స్కూళ్లు, కాలేజీలు బంద్‌ చేయాలని నిర్ణయించారు.

హర్యానాలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేశారు. కోల్‌కతాలో కూడా మార్చి 31 వరకు పాఠశాలలు, మాల్స్‌ మూసివేశారు.

- Advertisement -