హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నకిలీ ఓటర్ల అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నాయన్న వాదనకు బలం చేకూరుస్తూ తాజాగా కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్నగర్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు బయటపడ్డాయి.
ఎవరూ నివాసం లేని ఓ ఇంట్లో 68, మరో ఇంట్లో 74 ఓట్లు ఉండటం కలకలం సృష్టిస్తోంది. ఈ ఇళ్లు చాలాకాలంగా పాడుబడిపోయి ఉన్నాయని, వీటిలో ఎవరూ నివసించడం లేదని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఈ ఇళ్లలో నివసించిన వారు మరోచోట ఓటు నమోదు చేసుకున్నారా? లేదా? అనేది తెలియలేదు. ఒకవేళ మరోచోట ఓటరుగా నమోదై ఉంటే ఈ ఓట్లను ఎందుకు తొలగించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్డులున్నా.. ఓట్లు లేవు…
మరోవైపు తమ ఓట్లు అన్యాయంగా తీసేశారని పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులతో వచ్చినప్పటికీ ఓటు వేసే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో ఓటు వేశామని, ఇప్పుడు తమ ఓట్లను ఎందుకు తొలగించారో తెలియదని వారు వాపోతున్నారు.
తమ ఓట్లను తొలగించారని తెలిసి మళ్లీ ఓటు నమోదు కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని మరికొంత మంది చెప్పారు. మనుషులు లేని ఇంట్లో ఓట్లు ఉన్నాయని, తాము ఇక్కడ ఉంటున్నప్పటికీ ఓట్లు తొలగించారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.