కామారెడ్డి: కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అబద్ధాలు విని సంతోష పడాలంటే కేసీఆర్, మోడీల సభలకు వెళ్లాలని, వాస్తవాలు వినాలంటే తన సభకు రావాలంటూ రాహుల్ చురకలు వేశారు.
తన ఇంటికి మాత్రం రూ.300 కోట్లు…
‘‘రాష్ట్రంలో విద్య, వైద్యానికి నిధులు లేవంటారు. కానీ, కేసీఆర్ ఇంటికి ఖర్చుపెట్టడానికి మాత్రం రూ.300 కోట్లు ఉంటాయి. తెలంగాణకే తలమానికమైన నిజాం సుగర్ ఫ్యాక్టరీ తెరిచేందుకు కూడా డబ్బులు లేవంటారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం సుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. కానీ, అది ఇప్పటికీ మూసే ఉంది..’’ అంటూ రాహల్ గాంధీ.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు.
ప్రతి కుటుంబంపై రూ.2.16 లక్షల అప్పు…
‘‘2014లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చేసిన వాగ్దానాన్ని కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని భావించాం. కానీ నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ అవినీతిపరుడని దేశం తెలుసుకుంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ రాజ్యాన్ని నెలకొలిపారు. తెలంగాణ ప్రజలను అప్పులపాలు చేశారు. తెలంగాణలో ప్రతి కుటుంబంపై 2.16 లక్షల అప్పు ఉంది. ప్రతి వ్యక్తి మీద రూ.60 వేలు అప్పు ఉంది..’’ అని రాహుల్ ఆరోపించారు.
ఆ విషయంలో కేసీఆర్, మోడీ ఒక్కటే…
ఆ తరువాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీని టార్గెట్ చేశారు. కేంద్రం ప్రభుత్వం రాఫెల్ ఒప్పందంలో భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ విమర్శలు గుప్పించారు. రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును కేసీఆర్ ఎలాగైతే లక్ష కోట్లకు ఎలా పెంచారో, అక్కడ మోడీ ప్రభుత్వం రూ.500 కోట్ల ప్రాజెక్టును రూ.32 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. ఈ విషయంలో మోడీ, కేసీఆర్ ఒకలాగే వ్యవహరించారంటూ నిప్పులు కురిపించారు.
బీజేపీకి కేసీఆర్ మద్దతు…
మోడీ తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రపంచమంతా నోట్ల రద్దు పథకమంత దరిద్రమైన నిర్ణయం మరొకటి లేదని విమర్శిస్తుంటే.. కేసీఆర్ మాత్రం అది చాలా గొప్ప పథకం అంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో కూడా మోడీకి మద్దతు ఇస్తున్నారన్నారు. మోడీని సమర్థించేందుకు ఇప్పుడు కేసీఆర్తో పాటు ఎంఐఎం కూడా సిద్ధమైందన్నారు.
గల్ఫ్ బాధితులకు ద్రోహం…
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డలకు కూడా కేసీఆర్ ద్రోహం చేశారని రాహుల్ మండిపడ్డారు. ‘‘తాము అధికారంలోకి వస్తే రూ.500 కోట్లు గల్ఫ్ బాధితులకు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా గల్ఫ్ బాధితులకు సాయం చేస్తుంది.. అని రాహుల్ హామీ ఇచ్చారు.
మోడీ, కేసీఆర్ రైతులకు చాలా హామీలు ఇచ్చారని, అన్నింటిలోనూ విఫలమయ్యారని రాహుల్ అన్నారు. రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చారా లేదా అని ఈసారి కేసీఆర్ సభలో నిలదీయాలని రాహుల్ ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణ రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మా ముఖ్యమంత్రి శ్రమిస్తారు…
‘‘తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ నాలుగేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మభ్యపెట్టారు. కానీ మేం అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు ఇస్తాం.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేవరకు శ్రమిస్తారు.. ’’ అని రాహుల్ వెల్లడించారు.