హైదరాబాద్: భాగ్యనగరంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలి వద్ద రూ.2.34 లక్షలను కనుగొన్న జీహెచ్ఎంసీ అధికారులు విస్తుపోయిన వైనమిది. వివరాల్లోకి వెళితే.. దిల్సుఖ్నగర్ సమీపంలోని టీవీ టవర్ వద్ద భిక్షాటన చేస్తూ బిజిలి పెంటమ్మ అనే వృద్దురాలు జీవనం సాగిస్తోంది. ఇటీవల పెంటమ్మను జీహెచ్ఎంసీ అధికారులు ఆనందాశ్రమానికి తరలించారు.
ఈ క్రమంలో ఆమె తనతోపాటు తన సామానును కూడా ఆశ్రమానికి తరలించాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరింది. అయితే పెంటమ్మ ఇంటిలో సామాను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ఆమె వద్ద రూ.2.34 లక్షలు బయటపడ్డాయి.. అంతేకాక ఆమె చేతులకు వెండి ఆభరణాలు, మెడలో బంగారు గొలుసులున్నాయి.
ఈ విషయమై ఆరా తీయగా 2011లో హైదరాబాద్ అంబర్పేటలో తన వాటా కింద ఉన్న 60 గజాల రేకుల ఇంటిని విక్రయిస్తే బంధువులు రూ. 2 లక్షలను ఇచ్చారని ఆమె జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపింది.
భిక్షాటన ద్వారా…
ఆ డబ్బులో కోడళ్లు, మనమళ్లకు లక్ష రూపాయాలను ఇచ్చానని, మిగిలిన లక్ష రూపాయాలను తన వద్ద దాచుకున్నానని పెంటమ్మ వివరించింది. అంతేకాకుండా తాను భిక్షాటన చేస్తూ మరో 1.34 లక్షలను సంపాదించానని, ఈ మొత్తం కలిపి రూ. 2.34 లక్షలు తన వద్ద ఉన్నాయని ఆమె తెలిపింది.
అయితే ఇంత పెద్ద మొత్తం ఆ వృద్ధురాలి దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు ఎస్బీఐ చర్లపల్లి బ్యాంకులో ఆమె పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయించి ఆ నగదును అందులో డిపాజిట్ చేయించారు.