మహిళల సీట్లలో కూర్చుంటే జరిమానా! మెట్రో రైలులో ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు…

ladies only 1
- Advertisement -

ladies only

హైదరాబాద్: మెట్రో రైళ్లలో మహిళలకు కేటాయించిన సీట్లలో పురుషులు, ఇతరులు కూర్చుంటే వారికి రూ.500 జరిమానా తప్పదని హైదరాబాద్‌ మెట్రో రైలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వి.పి.రెడ్డి స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం మెట్రో అధికారులు ఓ ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసి, వారు ప్రతి బోగీపై డేగ కన్ను వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రసూల్‌పురా మెట్రోరైల్‌ భవన్‌లో సోమవారం మెట్రో అధికారులు, ఎల్‌ అండ్‌ టీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. దీనికోసం ఒక ప్రత్యేక ఎన్‌ ఫోర్స్‌మెంటు టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి మెట్రో బోగిలో ఎల్‌ అండ్‌ టీ సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీస్‌ నిఘా పెంచుతామన్నారు.

మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరూ కూర్చున్నా వారికి ఈ జరిమానా విధిస్తామన్నారు. మహిళలు ప్రయాణంలో తమకెదురైన అసౌకర్యాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ నంబర్‌ కేటాయించాలని ఎన్వీఎస్‌ రెడ్డి అధికారులకు సూచించారు. త్వరలో ఈ నిర్ణయాలు అమల్లోకి తీసుకొస్తామని ఎల్‌ అండ్‌ టీ అధికారులు తెలిపారు.

నాగోల్‌– అమీర్‌పేట్‌ వరకూ, ఎల్‌బీ నగర్‌ నుంచి మియాపూర్‌ వరకూ గల మెట్రో మార్గంలోని మెట్రో స్టేషన్ల పరిసరాలలో ఇంకా మిగిలివున్న సివిల్‌ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం అధికారులను మెట్రో ఎండీ ఆదేశించారు.

మెట్రో స్టేషన్‌ల వాటి పరిసర ప్రదేశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలని, స్టేషన్‌ పరిసరాలన ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎన్వీఎస్‌ రెడ్డి ఆదేశించారు.

ఇందుకోసం మెట్రో టౌన్‌ ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ టీంను ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని అధికారులు ఎప్పటికప్పుడు మెట్రో ప్రయాణికులకు, పాదచారులకు ఎలాంటి అసౌకర్యం కలగనిరీతిలో కృషి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో ఎల్‌అండ్‌ టీ మెట్రోరైలు మేనేజింగ్‌ డైరక్టర్ కె.వి.పి.రెడ్డి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు అనిల్‌ సహాని, చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆనందమోహన్, హైదరాబాద్‌ మెట్రోరైలు ఉన్నతాధికారులు విష్ణువర్థన్, బి.యన్‌.రాజేశ్వర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -