హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు(వర్కింగ్ ప్రెసిడెంట్)గా కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో.. ముందుగా నిర్ధారించిన ముహూర్తం ప్రకారం 11.56 గంటలకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు.
అంతకుముందు కేటీఆర్ తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపీ కవిత కేటీఆర్కు వీరతిలకం దిద్దారు. అనంతరం తన నివాసం నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్ వరకు 20 వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చారు.
టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ…
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించాయి.ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు హాజరవడంతో… తెలంగాణ భవన్ వద్ద కోలాహలం నెలకొంది.
టీఆర్ఎస్ భవన్ వద్దకు చేరుకున్న కేటీఆర్కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలకనేతలు ఘనస్వాగతం పలికారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధిపేట ఎమ్మెల్యే, కేటీఆర్ బావ అయిన హరీష్ రావు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
కేటీఆర్ ఈ నెల 20 నుంచి జిల్లా పర్యటనలు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.