అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. క్రమంగా తుపానుగా మారి.. ఆపైన తీవ్ర తుపాను రూపం దాల్చింది. ‘ఫెథాయ్’గా పిలుస్తోన్నఈ తుపాను ప్రస్తుతం గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఆదివారం మధ్యాహ్నమే ఇది తీవ్ర తుపానుగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం పెథాయ్ తుపాను నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి.. సోమవారం సాయంత్రం కాకినాడ-తుని మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర తుపానుగా ఉన్న పెథాయ్ తీరం దాటే ముందు బలహీన పడి తుపానుగా మారనుంది.
తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు…
మరోవైపు పెథాయ్ తుపాను ప్రభావం కారణంగా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది తీరాన్ని సమీపించే కొద్దీ గాలుల వేగం 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
దీని ప్రభావం వల్ల ఇప్పటికే తీరం వెంబడి సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తీరం దాటాక కూడా భారీ వర్షాలు…
తుపాను ప్రభావం కారణంగా కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు జల్లులు కూడా మొదలయ్యాయి. సోమవారం కోస్తాంధ్ర అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
తుపాను తీరం దాటాక కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా పడవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావొచ్చని అధికారుల అంచనా.
సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్…
పెథాయ్ తుపానుపై వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ ద్వారా తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.
టిట్లీ తుపాను సమయంలో పడిన ఇబ్బందులు పునరావృతం కాకూడదన్నారు. విపత్తు నిర్వహణలో ముందస్తు అప్రమత్త మంచిదన్నారు. రాకాసి గాలుల దెబ్బకు విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉందని.. సకాలంలో విద్యుత్ పునరుద్ధరణ చర్యలు జరగాలన్నారు. స్తంభాలను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుపాను వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు.
ప్రజలకు తాగునీరు, ఆహారం విషయాల్లో ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఆహార పాకెట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీకి సిద్ధం చేసుకోవాలని సూచించారు. సహాయ చర్యలలో ప్రజల సహకారం తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో ఓ టీమ్ సిద్ధంగా ఉండాలన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో హై అలర్ట్…
మరోవైపు పెథాయ్ తుపాను కాకినాడ, విశాఖ మధ్య తీరం దాటుతుందన్న సమాచారంతో హోంమంత్రి చినరాజప్ప అధికారుల్ని అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని 14 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుదని అంచనా వేస్తున్నామని చెప్పారు. అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన ఆయన.. నిత్యావసర సరుకులు, ఇతర అవసరాలు అన్నీ అందుబాటులో ఉంచామన్నారు. హెలికాఫ్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.