తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నరసింహన్.. త్వరలో ఉత్తర్వులు?

- Advertisement -

హైదరాబాద్: ఈఎస్ఎల్ నరసింహన్‌ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కానున్నారా? తెలుగు రాష్ట్రాలపై మంచి పట్టున్న ఆయన సేవలను కేసీఆర్ వినియోగించుకోబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది.

తెలంగాణ గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన నరసింహన్ స్థానంలో తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందర రాజన్‌ను నియమిస్తూ ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నరసింహన్‌కు మాత్రం ఎటువంటి పదవి ఇవ్వకుండా పక్కనపెట్టింది.

దాదాపు పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయనను తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.

ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్‌ను కలిసిన కేసీఆర్ గవర్నర్‌గా ఇంతకాలం అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు నరసింహన్ గవర్నర్‌గా సేవలందించారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 2009 డిసెంబర్‌లో నాటి యూపీఏ ప్రభుత్వం నరసింహన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించింది. అప్పటి నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగారు.

దాదాపు పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌కు ఇక్కడి పాలనా వ్యవహరాలపై మంచి పట్టుంది. పలుమార్లు ఆయన కీలకంగా వ్యవహరించారు. దీనికితోడు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ.

దీంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణానికి నరసింహన్ సేవలు వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.

గవర్నర్‌గా ఆయన తన పదవికి రాజీనామా చేసిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

- Advertisement -