హైదరాబాద్: బీజేపీతో టీఆర్ఎస్కు ఉన్న సంబంధాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. బీజేపీ తమ మిత్రపక్షం కాదని, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అయితే ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని, ఆ పార్టీతో కలసి పని చేస్తామని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే అసెంబ్లీ రద్దుకు వెళ్లామని.. క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకు వెళ్లినందుకే తాము ఇంత ప్రగతిని సాధించామని అన్నారు. గత నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 21.96 శాతం ప్రగతిని సాధించిందని చెప్పారు.
‘‘దేశంలోనే ఓ పెద్ద బఫూన్.. రాహుల్ గాంధీ’’..
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ ఏంటో అందరికీ తెలుసని, ఆయన దేశంలోనే ఓ పెద్ద బఫూన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, లోక్సభలో నరేంద్ర మోడీ సీటు దగ్గరికి వెళ్లి ఆయన్ని రాహుల్ గాంధీ హత్తుకోవడం, ఆ తర్వాత కన్ను కొట్టడం దేశమంతా చూసిందని విమర్శించారు. హైదరాబాద్లో రాహుల్ ఇటీవలి పర్యటనపై కూడా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాహుల్ ఎన్నిసార్లు పర్యటిస్తే తమకు అంత మంచిదని, తాము మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోగలుగుతామంటూ ఎద్దేవా చేశారు.