హైదరాబాద్: ఏపీలో ఐటీ సోదాల సందడి సద్దుమణగకముందే… ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా రంగంలోకి దిగింది. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన పలు సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నైనుంచి వచ్చిన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెండు రోజుల క్రితం హైదరాబాద్తో పాటు ఏపీలో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.
హైదరాబాద్లో జరిపిన సోదాల్లో ఒకే చిరునామాపై అనేక ఆఫీసులు నిర్వహిస్తునట్లు గుర్తించిన అధికారులు అందుకు సంబంధించిన ప్రతాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లావాదేవీల నియంత్రణ చట్టం కింద కోట్ల రూపాయల బ్యాంకు రుణాలకు చెందిన కీలక పత్రాలను, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, పలు అగ్రిమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ మాజీ అధినేత విజయరామారావు కుమారుడు కె. శ్రీనివాస్ కల్యాణ్ రావు పై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు సమాచారం, నకిలీ ధ్రువపత్రాలతో శ్రీనివాస్ బ్యాంకులను 300 కోట్ల రూపాయల మేరకు మోసగించినట్లు 2016లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లోనూ విజయరామారావు కుమారుడు కె. శ్రీనివాస్ కల్యాణ్ రావు డైరెక్టర్గా ఉన్నట్లు సమాచారం.
కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు అప్పట్లో శ్రీనివాస్ కార్యాలయాలు, ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో పలు కీలక ప్రతాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో సుజనా చౌదరికి సంబంధించిన సంస్థలతో శ్రీనివాస్ ప్రమేయానికి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. వందల కోట్ల రూపాయల వ్యవహారం కావడంతో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
అయితే చెన్నై బృందం నిర్వహించిన తనిఖీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని హైదారాబాద్ ఈడీ జోన్ విభాగం వెల్లడించింది. మరోవైపు శ్రీనివాస్ సంస్థలతో తమకు లావాదేవీలు ఉన్నందున ఆ వివరాలు తెలుసుకునేందుకే ఈడీ అధికారులు వచ్చారని, తమ కంపెనీలపై ఎలాంటి దాడులు జరగలేదని సుజనా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.