నిజమాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిజామాబాద్ నగర మాజీ మేయర్, డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించిన సంగతి తెలిసిందే. విద్యార్థినుల ఫిర్యాదుతో సంజయ్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.
ఈ కేసులో 41- సీఆర్పీసీ ప్రకారం హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు సంజయ్కు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల 10న పోలీసులు ఆయన ఇంటి గోడకు నోటీసు అంటించారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. న్యాయవాది కృపాకర్ రెడ్డితో కలిసి వచ్చిన ఆయన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం సంజయ్ను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు. మధ్యలో ఓసారి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి విచారించారు. చివరికి ఆయన్ని అరెస్టు చేశారు. సంజయ్ని ఏసీపీ సుదర్శన్ విచారించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రశ్నించారు. సంజయ్పై 342, 354, 354ఏ, 506, 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో సంజయ్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించనున్నారు.