

హైదరాబాద్: ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. క్రైస్తవ సమాజానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆ సమాజం పరువు తీయొద్దని సూచించింది.
హైదరాబాద్ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్రంట్ కన్వీనర్ జెరూసలెం మత్తయ్య మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. అడ్డగోలు విమర్శలతో క్రైస్తవుల పరువు తీయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు పడవల్లో కాలు పెట్టొద్దు
ఉంటే రాజకీయాల్లో ఉండాలని, లేదంటే మతబోధకుడిగా ఉండాలని మత్తయ్య సూచించారు. ఇకపై రాజకీయాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన వద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాదని పాల్గొంటే క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరణ తప్పదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు కలవడానికి కారణం దైవ శక్తేనని, దానిని దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. కాగా, ఇటీవల మరింత జోరు పెంచిన పాల్ టీవీ ఇంటర్వ్యూల్లో అధికార, ప్రతిపక్ష నేతలను ఉతికి ఆరేస్తున్నారు. జగన్ నుంచి ప్రధాని మోదీ వరకు అందరిపైనా విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.








