సీ-ఓటర్‌ సర్వే: తెలంగాణలో మహాకూటమి ప్రభంజనం..!? టీఆర్ఎస్‌కి 42 స్థానాలేనా?

c voter survey-congress likely to get clear majority in telangana
- Advertisement -

c voter survey-congress likely to get clear majority in telangana

ఇండియా టుడే – పొలిటికల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (PSE) సర్వే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని వెల్లడిస్తే, సీ-ఓటర్ సర్వే మాత్రం ఇందుకు భిన్నమైన అంచనాలు వెల్లడించింది.  సెంటర్‌ ఫర్‌ ఓటింగ్‌ ఒపీనియన్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ (సి-ఓటర్) సంస్థ ఏబీపీ న్యూస్‌, రిపబ్లిక్‌ టీవీ కోసం ఈ సర్వే నిర్వహించింది. ఈ సంవత్సరం ఎన్నికలు జరుపుకోనున్న ఐదు రాష్ట్రాల్లో మొత్తం 67,848 మంది నుంచి సర్వే కోసం అభిప్రాయాలు సేకరించారు.

తెలంగాణలో 13,624 మంది నుంచి, రాజస్థాన్‌లో 13,377 మంది నుంచి, మధ్యప్రదేశ్‌లో 25,745 మంది నుంచి, ఛత్తీస్‌గఢ్‌లో 13,911 మంది నుంయి, మిజోరంలో 1191 మంది నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రకారం  ఈ అంచనాలు రూపొందించారు.

తెలంగాణలో మహాకూటమిదే హవా…

తెలంగాణలో మహాకూటమి విజయం తథ్యమని  సీ-ఓటర్ సర్వే ప్రకటించింది. మహాకూటమికి 64 స్ధానాలలో స్పష్టమైన మెజారిటీ వస్తుందని, టీఆర్ఎస్‌కి 42 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది.

తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు 33.9 శాతం ఓట్లతో 64 స్థానాలు, 29.4 శాతం ఓట్లతో టీఆర్ఎస్ 42 స్థానాలలో గెలుపొందుతాయని  సీ-ఓటర్ సర్వే అంచనా వేసింది. అయితే బీజేపీ విషయానికి వచ్చేసరికి.. తెలంగాణలో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించినప్పటికీ.. బీజేపీకి కేవలం 4 స్థానాలు మాత్రమే వస్తాయని, 9 స్థానాలలో ఇతరులు గెలుస్తారని పేర్కొంది.

ఇక ఈ సర్వే ప్రకారం.. తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ సీఎంగా ఉండాలని 42.90 శాతం మంది కోరుకుంటుంటే, జానారెడ్డి సీఎంగా ఉండాలని 22.60 శాతం మంది కోరుకుంటున్నారట. సీఎం ఎవరని తేల్చుకోలేని వారు, ఇతరుల పేర్లు సూచించిన వారి సంఖ్య దాదాపు 27.30 శాతంగా ఉందట.

రాజస్థాన్‌‌లో కాంగ్రెస్‌ ప్రభంజనం..

వచ్చే ఎన్నికల ద్వారా రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని సీ-ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 47.9 శాతం ఓట్లతో 145 స్థానాల వరుకు లభిస్తాయని, బీజేపీకి 39.7 శాతం ఓట్లతో కేవలం 45 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపింది.

అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్‌ పైలట్‌ వైపు 38.7% శాతం మంది మొగ్గు చూపగా, ప్రస్తుత సీఎం వసుంధర రాజేకు కేవలం 22.7 శాతం, అశోక్‌ గెహ్లాట్‌‌కు 20.5 శాతం ఓట్లు లభించాయి.

మధ్యప్రదేశ్‌‌లో బీజేపీకి వ్యతిరేక పవనాలు…

సీ-ఓటర్ సర్వే గణాంకాల ప్రకారం చూస్తే.. మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీకి పరాజయం తప్పదని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 42.3 శాతం ఓట్లతో 116 స్థానాలు దక్కుతాయని, బీజేపీకి 41.5 శాతం ఓట్లతో 107 స్ధానాల వరకు లభిస్తాయని ఈ సర్వే చెబుతోంది.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా సీఎం కావాలని 41.6% మంది కోరుకుంటున్నారట. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉండాలని 37.4% శాతం మంది కోరుకుంటున్నట్లు సీ – ఓటర్ సర్వే పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్‌‌లో హోరాహోరీ పోరు…

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. 42.2 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు 41 స్థానాలు రాగా, 41.6 శాత ఓట్లతో బీజేపీకి 43 స్థానాలు లభిస్తాయని, ఇతరులకు 16.2 శాతం ఓట్లతో 6 స్థానాలు వరకు దక్కుతాయని సర్వే పేర్కొంది.

ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశాలు లేవని అంచనా వేసింది. రమణ్‌సింగ్‌ ముఖ్యమంత్రి కావాలని 56.34% మంది కోరుకుంటున్నట్లు, అజిత్‌ జోగి ముఖ్యమంత్రి కావాలని 43.66% శాతం మంది కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

మిజోరంలో బీజేపీ కుటమికే అనుకూలం…

ఇక మిజోరం విషయానికొస్తే.. ఇక్కడ కాంగ్రెస్‌కు పరాభవం తప్పేలా లేదని స్పష్టమవుతోంది. మిజోరంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ మద్దతు పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్‌కు 17 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 12 స్ధానాలు, జేపీఎంకు 9 స్థానాల వరకు లభించనున్నాయని తెలిపింది.

ఐదుసార్లు ముఖ్యమంతిగా సేవలందించిన తన్హావాలాకు ఆదరణ తగ్గనట్లు తెలుస్తోంది. ఆయన ముఖ్యమంతిగా ఉండాలని 27.3 శాతం కోరుకుంటున్నారు. ఎంఎన్ఎఫ్‌ నేత జోరాథాంగా సీఎం కావాలని 25.4 శాతం మంది కోరుకుంటున్నారని వెల్లడించింది.

చదవండి: వీడిన ఉత్కంఠ: మోగిన ఎన్నికల నగారా, తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలు 

చదవండి: 2019 లోక్‌సభ ఎన్నికలు: ఎవరి పరిస్థితి ఏమిటి? ’274‘ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే…

- Advertisement -