అప్పట్లో వైఎస్ చేశారు.. ఇప్పుడు చంద్రబాబు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు: పవన్ కల్యాణ్

pawan-kalyan-in-vijayawada
- Advertisement -

విజయవాడ: గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బాక్సైట్ తవ్వకాలకు అనుమతించి తప్పు చేస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారీ అక్రమ మైనింగ్‌కు వత్తాసు పలుకుతూ అంతకంటే పెద్ద తప్పును చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శనివారం తన విజయవాడ పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తూర్పుగోదావరి జిల్లాలోని వంతాడలో అక్రమ మైనింగ్ ఓ పెద్ద కంపెనీ తరహాలో సాగుతోందని, కానీ బయటకు మాత్రం అక్కడ అసలేమీ జరగనట్లు కలరింగ్ ఇస్తున్నారని జనసేనాని వ్యాఖ్యానించారు. ఈ అక్రమ మైనింగ్ దెబ్బకు వంతాడలో తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నిబంధనలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వం..’’

రిజర్వు అటవీ ప్రాంతంలో మైనింగ్ చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాము ఒక్క వంతాడ ప్రాంతానికే వెళ్లి చూశామనీ, ఇలాంటి అక్రమ తవ్వకాలు ఏజెన్సీలోని వందల ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పారు. మరి ఇదంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

గతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తప్పు చేస్తే.. ఇప్పుడు భారీ అక్రమ మైనింగ్‌కు వత్తాసు పలుకుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకంటే పెద్ద తప్పును చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసమే టీడీపీకి తాము మద్దతు ఇచ్చామని, కానీ అక్రమ మైనింగ్ మాత్రం ఆగలేదని, యధేచ్ఛగా జరిగిపోతూనే ఉందని పవన్ దుయ్యబట్టారు. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే.. వెంటనే బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -