హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. అబ్బాయిలు చదువులో ఎందుకు వెనుకబడిపోతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలిచారు. ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాల్లోనూ అమ్మాయిలే టాప్.
దీంతో చదువుల్లో అబ్బాయిలు కంటే అమ్మాయిలే ముందంజలో సాగుతుండడం, అబ్బాయిలు వెనుకపడుతుండడంపై చర్చ మొదలైంది.
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి.
ఫెయిలైన విద్యార్థులు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలని, త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల వివరాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో.. 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 67.77 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయిగా నిలిచారు. 52.30 శాతం బాలురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో.. 2,83,462 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 75.15 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయిగా నిలిచారు. 62.12 శాతం బాలురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఫస్టియర్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా, సెకండియర్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురంభీమ్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ఇటర్మీడియెట్ విద్యార్థులు పరీక్ష ఫలితాలను కింద ఇచ్చిన వెబ్సైట్లలో చూసుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో TSBIE m-Services అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫలితాలు చూసుకోవచ్చు.
http://Tsbie.cgg.gov.in
http://Manabadi.com
http://Examresults.ts.nic.in
schools9.com
ఏపీలో ఫలితాలు తీరు ఇలా…
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,07,230 లక్షల మంది విద్యార్థులు హాజరవగా 3,00,560 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 64 శాతం కాగా.. బాలురు 55 శాతంగా ఉన్నట్లు చెప్పారు.
అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,35,655 మంది హాజరుకాగా.. వీరిలో 2,76,389 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
వీరిలోనూ బాలికలు 65 శాతం కాగా.. బాలురు 60 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
ఇక ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో తొలి స్థానం కృష్ణా జిల్లా(75 శాతం)కు దక్కగా, రెండోస్థానం పశ్చిమ గోదావరి, గుంటూరు(65 శాతం) జిల్లాలు, మూడో స్థానంలో విశాఖపట్నం(63 శాతం) జిల్లా నిలిచింది.
అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తొలి స్థానం కృష్ణా జిల్లా(75 శాతం)కు దక్కగా, రెండోస్థానం పశ్చిమ గోదావరి(71 శాతం) జిల్లాలు, మూడో స్థానంలో నెల్లూరు, విశాఖపట్నం(68 శాతం) జిల్లాలు నిలిచాయి.