భారత్‌లో ‘వావ్‌’ ఎయిర్‌ సేవలు.. అతి తక్కువ ధరలకే విమాన టికెట్లు!

- Advertisement -

న్యూఢిల్లీ: ఐస్‌లాండ్‌కు చెందిన విమానయాన సంస్థ ‘వావ్‌ ఎయిర్‌’  భారత విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆపర్‌ ఇస్తోంది. త్వరలోనే భారత్‌లో  కార్యకలాపాలకు రెడీ అవుతోంది. ఢిల్లీ నుంచి రెక్జావిక్‌ (ఐస్‌లాండ్‌ రాజధాని) మీదుగా ఉత్తర అమెరికా, యూరప్‌లలోని వివిధ ప్రాంతాలకు డిసెంబర్‌ నుంచి సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది.

రెక్జావిక్‌లోని కెఫ్లావిక్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు తన సేవలను ప్రారంభించనున్నట్టు ‘వావ్‌ ఎయిర్‌’ తెలిపింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్, చికాగో,  టొరొంటోలాంటి 15 నగరాలకు విమాన  సేవలను అందించనున్నట్టు పేర్కొంది.

అతి తక్కువ ధరల్లో రూ.13,499 బేసిక్‌ ఫేర్‌తో (పన్నులు సహా) టికెట్‌ను (వన్‌వే ప్రయాణానికి) ఆఫర్‌ చేస్తున్నట్లు ‘వావ్‌’ పేర్కొంది.  అయితే ఈ ధరకు బ్యాగేజ్‌ చెకింగ్‌, ఫుడ్‌ ఖర్చులు అదనమని తెలిపింది. అలాగే ప్రీమియం టికెట్‌ ధర రూ.46,599 నుంచి  ప్రారంభమౌతుందని ఆ సంస్థ  ఫౌండర్‌, సీఈవో స్కల్‌ మోజెన్సెన్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌ 7వ తేదీ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా  సేవలు ప్రారంభమవుతాయని ఆయన  ప్రకటించారు. ఈ మేరకు  వారానికి ఐదు స్లాట్లు పొందేందుకు  ఇప్పటికే జీఎంఆర్‌తో  డీల్‌ కుదుర్చుకున్నట్టు చెప్పారు. ప్రతి రోజు  ఇండియా, ఉత్తర అమెరికా  మధ్య సుమారు 20 వేల మంది ప్రయాణిస్తారని, ఇంత భారీ డిమాండ్‌ ఉన్న భారత్‌లో తక్కువ ధరకే  అంతర్జాతీయ టికెట్లను అందిస్తున్న  మొట్టమొదటి  విమానయాన సంస్థ తమదేనని మోజెన్సెస్‌ చెప్పారు. చమురు ధరలు 100 డాలర్లు దాటిపోయినా తమకు ఎలాంటి ఆందోళన లేదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -