
బెంగుళూర్: మండ్య లోక్సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు మద్దతుగా నిలిచిన స్టార్ హీరోలు దర్శన్, యశ్లకు బెదరింపులు ప్రారంభమయ్యాయి. ఇదే స్థానం నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నందున ఈ సీటుకు ప్రాధాన్యత ఏర్పడింది.
సుమలత మీడియా ముందుకొచ్చి పోటీ విషయం ప్రకటించినప్పుడే కాకుండా తాజాగా నామినేషన్ వేసిన సమయంలోనూ ఇరువురు స్టార్ హీరోలు దర్శన్, యశ్లు ఆమె వెంటే ఉన్నారు. దీంతో జేడీఎస్ నేతలకు గుబులు పట్టుకొంది. కె.ఆర్.పేటకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణగౌడ ఇరువురి హీరోలపైనా తీవ్రంగా స్పందించారు.
సినీ హీరోలు తమ వైఖరిని ఇలాగే కొనసాగిస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందన్నారు. నటుల అక్రమాల జాతకాలను వెలికితీయాల్సి ఉంటుందన్నారు. కన్నడ నటులు గౌరవంగా వారి ఇళ్ళల్లో ఉండాలని ప్రచారం పేరిట జేడీఎస్, నాయకులను విమర్శిస్తే బాగుండదని హెచ్చరించారు. ఇళ్ళల్లో మర్యాదగా గడపకుండా తమ నాయకుల పట్ల ఏమాత్రం అసభ్యంగా మాట్లాడినా గుణపాఠం తప్పదన్నారు.








