న్యూఢిల్లీ : గ్రాడ్యుయేట్లకు శుభవార్త! డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పేటీఎం మాల్ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో దాదాపు 5000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇది క్యాంపస్ ఐకాన్ ప్రొగ్రామ్లో సెకండ్ ఎడిషన్.
నిజానికి పేటీఎం మాల్ ఈ క్యాంపస్ ఐకాన్ ప్రోగ్రామ్ను 2017లో లాంచ్ చేసింది. ప్రస్తుతం సెకెండ్ ఎడిషన్లో.. విద్యార్థులకు టెక్నాలజీ, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను పేటీఎం మాల్ చేపట్టనుంది. వీటిలో టాప్ పర్ఫార్మర్స్ జాబితాను అక్టోబర్ 10న పేటీఎం మాల్ ప్రకటించనుంది. వీరికి లక్ష రూపాయల వరకు నగదు బహుమతితో పాటు, పేటీఎం మాల్లో ఫుల్-టైమ్ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేస్తోంది.
ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎడిషన్లో.. 2,200 మంది విద్యార్థులను పేటీఎం మాల్ నియమించుకుంది. ‘మా క్యాంపస్ ఐకాన్ ప్రొగ్రామ్ ప్రారంభ ఎడిషన్లో దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వందలాది గ్రాడ్యుయేట్లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఏడాది కూడా మరింత మంది విద్యార్థులను చేరుకోవాలనుకుంటున్నాం. దేశంలోనే ఇది అతిపెద్ద క్యాంపస్ ఐకాన్..’ అని పేటీఎం మాల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్సిన్హా తెలిపారు.
ఈ ప్రొగ్రామ్తో తర్వాతి తరం యువ ప్రొఫెషనల్స్కు మంచి అనుభవం వస్తుందని, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు, ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదో అపూర్వ అవకాశమని ఆయన పేర్కొన్నారు. కస్టమర్ల రోజువారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ఆఫ్లైన్ మర్చెంట్ల వ్యాపారాభివృద్ధిని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు అమిత్ సిన్హా తెలిపారు.