
ఢిల్లీ: ఎప్పుడూ ఏదొక వివాదంలో ఉంటూ వార్తల్లోకే ఎక్కే కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ మరోసారి ప్రధాని మోడీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మోడీ గత ఎన్నికల్లో గంగామాత పుత్రుడినని చెప్పుకొని వచ్చారని కానీ ఈ ఎన్నికల్లో రాఫెల్ ఏజెంట్ అనే ముద్ర వేసుకుని వెళ్లిపోతారని సెటైర్లు వేశారు.
ఇక రాఫెల్ డీల్ లో బ్రోకరేజ్ సొమ్ము తీసుకున్నారో, లేదో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మోడీతో చర్చకు రాహుల్ గాంధీ అవసరంలేదని, తను సరిపోతానని చెప్పారు. రాహుల్ ఫిరంగి అయితే… తాను ఏకే47 అని అన్నారు. అయితే మోడీ స్వయంగా అవినీతికి పాల్పడ్డారా? లేక మరెవరైనా అవినీతికి పాల్పడటానికి సహకరించారా? అనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: హిందూ ఉగ్రవాది వ్యాఖ్యల ఫలితం: కమల్పై చెప్పు విసిరిన ఆందోళనకారులు
సిద్ధూకి ఈసీ క్లీన్ చిట్..
ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధూ.. పని తక్కువ మాటలు ఎక్కువ అనే రీతితో మోడీని ఉద్దేశించి విమర్శించిన విషయం తెలిసిందే. తక్కువ చపాతీలు చేసే పెళ్లికూతురు తన గాజుల మోతతో ఎక్కువ పని చేస్తుందనే భ్రమ కల్పించినట్టు మోడీ పనితీరు ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ వ్యాఖ్యలపై సిద్ధుపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించిన ఇండోర్ ఎన్నికల కార్యాలయం సిద్ధూకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలోకి రావని ఎన్నికల సంఘం తేల్చింది.








