ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు అద్భుతమైన విజయాన్ని సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీచేసిన అమిత్ షా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డును తిరగరాస్తూ కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై రికార్డు విక్టరీ నమోదు చేశారు.
అద్వానీ గతంలో 4.83 లక్షల మార్జిన్ తో గెలుపొందగా, అమిత్ షా 5.11 లక్షల మార్జిన్ తో సరికొత్త రికార్డు సృష్టించారు. తాజా విజయంతో అమిత్ షా కూడా లోక్ సభలో అడుగుపెట్టనున్నారు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ రెండో విజయం సాధించారు. సుమారు 3 లక్షల 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కాగా, జాతీయ స్థాయిలో ట్రెండ్స్ చూస్తే ఎన్డీయే 230 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 117 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే యూపీఏ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… 30 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 92 స్థానాల్లో లీడింగ్లో ఉండగా…. 19 స్థానాల్లో విజయం సాధించారు.
అమేథీలో రాహుల్ పై స్మృతి ఇరానీ ముందంజ…
ఇక అమేథిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కంటే కేంద్ర మంత్రి స్మృతి ముందంజలో ఉన్నారు. రాహుల్పై 2 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో స్మృతి కొనసాగుతున్నారు. అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో ఉన్నారు. అయితే, వయనాడ్లో ఆయన గెలుపు నల్లేరుమీద నడకలా భావిస్తుండగా, అమేథీలో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.








