

బెంగళూరు: తన తండ్రి వెచ్చని ఒడిలో కూర్చుని ముద్దు ముద్దు మాటలు చెప్పాల్సిన వయసులో ఆ చిన్నారి తండ్రినే పోగొట్టుకుంది. కాదు.. కాదు.. మన దేశానికి తన తండ్రిని త్యాగం చేసిందా చిన్నారి.
భర్తను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ చిన్నారి తల్లి కూడా తన పసుపుకుంకుమలను భారతమాత పాదాలకు అర్పించి అంతకుమించిన పెద్ద త్యాగమే చేసింది. ఇక మాతృభూమి యశోరక్షణలో నేలకొరిగి అమరుడైన ఆ మేజర్ తల్లి గురించి, ఆమె చేసిన త్యాగం గురించి చెప్పాలంటే మాటలే కరువవుతాయి.
తన తండ్రిని పోగొట్టుకున్న ఏడాది తరువాత ఆ చిన్నారి.. సైన్యం అంటే ఏమిటో వివరిస్తుండగా తీసిన వీడియో ఒకటి.. ప్రస్తుత పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఆమె తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే…
బెంగళూరుకు చెందిన మేజర్ అక్షయ్ గిరీష్ భారత సైన్యంలో పనిచేసేవారు. 2016లో జమ్ము కశ్మీర్లోని నగ్రోతా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో గిరీష్ అమరుడయ్యారు. ఇది జరిగిన సమయంలో అతడి కుమార్తె నయనకు రెండున్నరేళ్లు.
తన తండ్రిని కోల్పోయిన ఏడాది తరువాత నయన సైన్యం గురించి వివరిస్తుండగా ఆమె తల్లి మేఘన తీసిన వీడియో అది. పుల్వామాలో ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందు అంటే.. ఫిబ్రవరి 10న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ తరువాత నాలుగు రోజులకే పుల్వామాలో ఉగ్రదాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదంపై, పాకిస్తాన్పై సోషల్ మీడియాలో తీవ్ర అగ్రహావేశాలు పెల్లుబుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మీ గురించి నయనా చెప్పిన మాటలు కూడా వైరల్గా మారాయి.
‘‘సైన్యం మనకు ప్రేమను పంచుతుంది. సైన్యం బ్యాడ్ అంకుల్స్తో పోరాడుతుంది. మనం ధైర్యంగా బతికేందుకు ఆర్మీ హెల్ప్ చేస్తుంది. సైన్యం అందరితో జైహింద్ అనిపిస్తారు. జైహింద్..’’ అంటూ చిన్నారి నయన చెప్పిన మాటలు అందరి గుండెలను బరువెక్కిస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పారనే ప్రశ్నకు.. ‘‘మా నాన్న చెప్పారు’’ అని ఆ చిన్నారి బదులివ్వడం చూస్తుంటే.. ఆ చిన్నారికి తన తండ్రితో ఉన్న అనుబంధం ఏపాటిదో అర్థమవుతుంది.
A year after Akshay’s martyrdom, Naina recollects conversations with her papa.
Here she teaches us what ‘Army is…’
This random video captures innocence and faith.
Love is an emotion.
Her papa’s love for the Army and Countrymen also stays within her.
Jai Hind. @adgpi pic.twitter.com/kWecbp1Tax
— Meghna Girish (@megirish2001) February 11, 2019








