

న్యూఢిల్లీ/జెరూసలేం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో గత 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ను తిరిగి పునరుద్ధరించనున్నారు. దీంతో ఓ భారత జవాను సతీమణి(94)కి కోటి రూపాయలు అందనున్నాయి.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్నల్ జార్జ్ మెంజమిన్ భారత ఆర్మీలోని ఇంజనీరింగ్ దళంలో సేవలందించారు. 1966లో పదవీ విరమణ పొందారు. అనంతరం సొంత దేశం ఇజ్రాయెల్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జార్జ్ 1990లో మృతిచెందడంతో ఆయనకు ఇస్తున్న పెన్షన్ను భారత ప్రభుత్వం నిలిపేసింది.
కాగా, జార్జ్ భార్య హెబె బెంజమిన్ సంబంధిత అధికారులకు ఎన్ని ఉత్తరాలు రాసినా ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినా ఎలాంటి స్పందనా లేదు. బెంజమిన్ కుటుంబం విదేశాల్లో నివసిస్తోందని కారణంతో పెన్షన్ ఆమెకు పెన్షన్ ఇవ్వలేదు.
‘నేను కూడా భారత రక్షణ శాఖకు ఎన్నో ఉత్తరాలు రాశాను. ఎన్నో సార్లు రక్షణశాఖ అధికారులను కలిసినా స్పందించలేదు’ అని బెంజమిన్ ఫ్యామిలీ ఫ్రెండ్ మనక్రీత్ కాంత్ తెలిపారు.
మోడీ దృష్టికి తీసుకురావడంతో..
ఇక చివరి ప్రయత్నంగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్కు లేఖలు రాశామని మనక్రీత్ తెలిపారు. 30 ఏళ్లుగా ఆగిపోయిన జార్జ్ పెన్షన్ను తిరిగి ఇప్పించాలని, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విన్నవించినట్టు చెప్పారు.
ఈ క్రమంలో, ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ప్రధాని కార్యాలయం పెన్షన్ పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని రక్షణశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. వడ్డీతో సహా ఆర్మీ మాజీ ఆఫీసర్ పెన్షన్ డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో వడ్డీతో కలిపి దాదాపు కోటి రూపాయల మొత్తాన్నిజనవరి 31 వరకు జార్జ్ భార్యకు అందివ్వనున్నారు. ఎట్టకేలకు తమకు పెన్షన్ అందేలా చొరవ చూపని ప్రధానికి బెంజమిన్ ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలిపింది.








