చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు హతం

sukma-encounter
- Advertisement -

sukma-encounter

రాయ్‌పూర్: మావోయిస్టులకు చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత నెల 20న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ మరిచిపోకమునుపే.. మళ్లీ సోమవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి, కన్నాయి గూడ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌‌లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు.  కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గొల్లపల్లి ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు కుంట ఎస్పీ ప్రకటించారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు సాధారణంగానే కనిపించినా మళ్లీ తాజాగా ఉద్రిక్తత నెలకొంది.

జులై 20 బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టులు వరుస దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అదను చూసి భద్రతాబలగాలు దెబ్బతీశాయి. గత నెలలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలకు నక్సల్స్ పిలుపునివ్వడంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది.  ఈ నేపథ్యంలోనే వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండడం గమనార్హం.

- Advertisement -