టీడీపీ నేత అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే తన పార్టీ నేత ఆసుపత్రిలో ఉండడంతో చూసేందుకు హుటాహుటిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చారు.
కానీ అచ్చెన్ను చూసేందుకు చంద్రబాబును అధికారులు అనుమతించలేదు. దీంతో చంద్రబాబు వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు.
గోడ దూకి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
సీఎంకు తప్ప ఎవరికీ ఏసీబీ ముందుగా తెలియజేయదని, టీడీపీ నేతలు రోజుకు ఒకరు అరెస్ట్ అవుతారని.. మంత్రులు అనడం సరికాదన్నారు.
మంత్రుల వ్యాఖ్యలతో కావాలని చేసినట్లు ఉందని అనుకుంటారన్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరన్నారు.
ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరన్నారు. కక్ష సాధింపునకే కేసులు పెడుతున్నారనడం సరికాదన్నారు.
అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు. అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం.. మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
జగన్ నిర్ణయాలు ప్రతిపక్షానికి నచ్చక కోర్టుల్లో పిల్లు వేశారని ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు తెలిపారు.