ఇద్దరు బిడ్డలను కోల్పోయా, టీడీపీ తిరస్కరించింది: సోషల్ మీడియా ప్రచారంపై పురంధేశ్వరి ఆవేదన

Daggubati Purandeswari
- Advertisement -

purandeswari

అమరావతి: తమ కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి ఆవేదనకు గురయ్యారు. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్‌లు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా దగ్గుబాటి కుటుంబంపై ఓ వర్గానికి చెందిన నెటిజన్లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. కాగా, కొందరు నెటిజన్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. దగ్గుబాటి కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వెంకటేశ్వరరావు భార్య, బీజేపీ నేత అయిన పురందేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు.

పురంధేశ్వరి భావోద్వేగం: ఎవరికీ తెలియని విషయాల వెల్లడి

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు కుటుంబసభ్యులకు తప్ప మిగితా ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టారు. తాను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం ఎంతమందికి తెలుసని.. కుమార్తె కంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరిని కోల్పోయానని పురందేశ్వరి చెప్పారు.

ప్రత్యేక వైద్య చికిత్సల కోసం తాను అమెరికా వెళ్లిన విషయం ఎంతమందికి తెలుసని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి ఎన్టీఆర్ తనను బలవంతంగా అమెరికా పంపించారన్న విషయం ఎంతమందికి తెలుసని పురందేశ్వరి నిలదీశారు. తనపై జరుగుతున్న ఈ మొత్తం ప్రచారం విషయంలో తాను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు.

టీడీపీ తిరస్కరించింది: పురంధేశ్వరి

తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలని వెంకటేశ్వరరావు అనుకున్నప్పుడు టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అంతేగాక, 2014లో తనకు టికెట్ రాకుండా చేసేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేసిందన్నారు. తాను ఏ వ్యక్తినీ వ్యక్తిగతంగా విమర్శించనని పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా తన కుటుంబాన్ని ప్రేమిస్తానన్నారు. దయచేసి ఇకపై తన వ్యక్తిగత విషయాల జోలికి, పిల్లలు, కుటుంబం విళషయంలో జోక్యం చేసుకోవద్దంటూ నెటిజన్లకు స్పష్టం చేశారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అత్యంత సున్నితమైన వ్యక్తిగత విషయాలను బయటకు లాగి రాజకీయం చేస్తున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, కుమారుడు వైసీపీలో చేరినప్పటికీ తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని పురంధేశ్వరి ఇప్పటికే ప్రకటించారు.

- Advertisement -