కర్ణాటకలో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు.. యడ్యూరప్పకు చంద్రబాబు ఫోన్, లేఖ…

chandrababu-naidu-letter-to-cm-yeddyurappa-on-srikakulam-fishermen-issue
- Advertisement -

అమరావతి: కరోనా లాక్‌డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్స్యకారులు కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం గురించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు.

చదవండి: ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా? అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు అదే పంథా: చంద్రబాబు ఫైర్

ఆయన నేరుగా కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఫోన్ చేసి మాట్లాడారు. మత్స్యకారులకు సహాయం చేయాలని, వీలైనంత త్వరగా వారిని వారి స్వస్థలానికి తరలించాలని కోరారు. 

ఒకవేళ మత్స్యకారులను వారి స్వస్థలాలకు తరలించడం వీలుకాని పక్షంలో వారికి అక్కడే వసతి, భోజన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన సీఎం యడ్యూరప్పకు ఓ లేఖ కూడా రాశారు. 

చంద్రబాబు రాసిన లేఖ సారాంశం యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాం…

తేది: 6 మే 2020,

శ్రీ బిఎస్ యడ్యూరప్పగారికి, 
ముఖ్యమంత్రి గారు,
కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు.

విషయం: కోవిడ్ లాక్ డౌన్ – కర్ణాటకలో ఉడుపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకు పోయిన శ్రీకాకులం జిల్లా మత్స్యకారులు 300మంది – ఆహారం లేక అగచాట్లు – తక్షణ సహాయం నిమిత్తం – ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు వారిని తరలించడం గురించి.

కోవిడ్19పై కర్ణాటక ప్రభుత్వం చేస్తోన్న పోరాటాన్ని, వైరస్ నియంత్రణకు తీసుకుంటోన్న చర్యలపై మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విపత్కర సమయంలో మేమంతా మీతోపాటు కర్ణాటక ప్రజలకు సంఘీభావంగా ఉంటాం. 

కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన ఏపీ కార్మికులు అనేకమంది ఆయా ప్రాంతాలలో అష్టకష్టాలు పడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 300 మంది మత్స్యకారులు కర్ణాటకలోని ఉడుపి జిల్లా మాల్పే గ్రామంలో చిక్కుకుపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. వారి యోగ క్షేమాలపై స్థానికంగా ఆయా కుటుంబాల సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు తల్లడిల్లుతున్నారు.

వారందరినీ వారి స్వస్థలాలకు తరలించేందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయా కుటుంబాల తరుపున, ప్రత్యేకించి నా తరుపున మిమ్మల్ని అభ్యర్థిస్థున్నాను. 

అది వీలుగాని పక్షంలో లాక్‌డౌన్ పూర్తి అయ్యేదాకా వారికి అక్కడే ఆశ్రయం, ఆహారం, తాగునీరు, వైద్య సాయం.. ఇతర నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరుతున్నాను.

సదరు మత్స్యకారులను ఆదుకునేందుకుగాను ఆనంద్ (+91 90047 78368) ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అభినందనలతో…

భవదీయుడు
నారా చంద్రబాబు నాయుడు.

- Advertisement -