

అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై తెలుగుదేశం, బిజెపిల మధ్య మాటల వార్ తీవ్ర రూపం దాల్చుతుంది. మంత్రులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో మోడీ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో టీడీపి ప్రభుత్వానికి ఏపీ లో పుట్టగతులుండవు అని ఆయన హెచ్చరించారు.
మోడీ చెప్పబోతున్నాడో …
రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు ఏం సహాయం చేసిందనే లెక్కలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ చెబుతారని జీవీఎల్ శనివారం మీడియాతో అన్నారు. మోడీ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే, దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన అన్నారు.
ప్రధాని పర్యటనను అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేస్తే రాష్ట్రంలో టీడీపి ప్రభుత్వం ఉండదని ఆయన అన్నారు. ప్రధాని మోడీ రేపు (ఆదివారం) గుంటూరు పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే.
మోడీ పర్యటనకు వ్యతిరేకంగా తెలుగుదేశం, వామపక్షాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేస్తూ , నల్ల బ్యాడ్జీలతో తమ నిరసనలు తెలుపుతున్నారు.
చదవండి: దేశాన్ని విమర్శిస్తారా?: ‘మహా కల్తీ కూటమి’ అంటూ కాంగ్రెస్, విపక్షాలను ఏకేసిన మోడీ








