చంద్రబాబుపై సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్

- Advertisement -

న్యూఢిల్లీ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై టీడీపీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుజనా చౌదరి, కామినేని, ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులతో కలిసి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై ఆయనకు ఫిర్యాదు చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఓ ఎమ్మెల్యే మాత్రమేనని, జమిలి ఎన్నికలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు.

జమిలి ఎన్నికలపై తనకు ఇంతవరకు సమాచారం లేదన్నారు. జగన్ సర్కారుకు ప్రతిపక్షాలపై దాడి చేయడం తప్ప పరిపాలనపై దృష్టి పెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆరోపించారు.

పోలవరం, అమరావతిపై ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేసి నెలరోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందిచకపోవడం దారుణమన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారని, ఆ తర్వాత టీడీపీ హయాంలో కాలయాపన జరిగిందన్న సుజనా.. దీనిల్లే ప్రాజెక్టు ట్రాక్ తప్పిందన్నారు.

ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏకపక్ష ధోరణితో వెళ్తోందని, కేంద్రం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరంపై ఆలస్యం చేయడం వల్ల ప్రతీ సీజన్‌లో 10 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందన్నారు.

ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని సుజనా హెచ్చరించారు.

- Advertisement -