ఏపీలోనూ లైట్స్ ఆన్.. సౌండ్.. కెమెరా.. యాక్షన్! సీఎం జగన్‌కు సినీ పెద్దల ధన్యవాదాలు…

- Advertisement -

అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్‌లో సినిమా, టీవీ షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి అనుమతిచ్చారు. 

ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ ప్రముఖులతో జగన్ భేటీ అయ్యారు. 

ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితోపాటు టాలీవుడ్ ప్రముఖులు నాగార్జున, దిల్ రాజు, త్రివిక్రమ్, రాజమౌళి, సురేష్ బాబు, సి.కళ్యాణ్, మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు.

దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు.

కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి…

అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో షూటింగ్‌లు జరుపుకునేందుకు సీఎం జగన్ అనుమతి ఇవ్వడం సంతోషకరం అన్నారు.

‘‘నిజానికి సీఎం జగన్‌ను కలవాలని టాలీవుడ్ ప్రముఖులమంతా ఏడాది కాలంగా అనుకుంటున్నాం.. కానీ కుదరలేదు.. ఈ రోజు కలిశాం..ముందుగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు..’’ అని అన్నారు.

థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జీలు ఎత్తేయాలని కోరామని, 2019-20 ఏడాదికి సంబంధించి నంది అవార్డు వేడుకల నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు.

ఇంకా టిక్కెట్ల ధరలు, ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరామని, అన్ని విషయాలపైనా సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని, పరిశీలిస్తామని చెప్పారని చిరంజీవి వివరించారు.

తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తాను వెన్నంటి ఉంటానంటూ సీఎం జగన్ చెప్పడం ఆనందం కలిగించిందని వ్యాఖ్యానించారు.

విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణానికి దివంగత సీఎం, మహానేత వైఎస్సార్‌ భూమి ఇచ్చారని, అక్కడ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని చిరంజీవి పేర్కొన్నారు.  

థియేటర్ల ఓపెన్ మాత్రం అప్పుడే: మంత్రి పేర్ని నాని

తెలుగు సినీ పరిశ్రమకు తోడుగా ఉంటామని, జులై 15 తర్వాత సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారని, సినిమా థియేటర్లు మాత్రం కేంద్రం అనుమతి ఇచ్చాకే తెరుస్తామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు.  థియేటర్ల మినిమం ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఎత్తివేయాలని సినీ పెద్దలు కోరిన అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

అలాగే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ చేసే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. 2019-20 నంది అవార్డులకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని సీఎం జగన్‌ కూడా ఆదేశించారన్నారు.

చిన్న సినిమాల విడుదలకు రాయితీలపైనా సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో సెటిల్‌ అవ్వాలనుకునే వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూడా మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.  

- Advertisement -