- Advertisement -
అమరావతి: ఏపీలో ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఎక్కువైపోయాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో ఉండగా.. ఇలాంటి సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, ఆయన వైసీపీలో చేరిపోయారు.
వైసీపీ అధినేత జగన్ సమక్షంలో హర్షకుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు శ్రీహర్ష కూడా వైసీపీలో చేరారు. వీరిద్దరికీ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ఇ టీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీ సీటును ఆయన ఆశించారు. కానీ, ఆ సీటు దక్కకపోవడంతో హర్షకుమార్ నిరాశకు గురయ్యారు. మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు.
వైసీపీలో చేరనున్న సాయిప్రతాప్..?
అలాగే మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ వారం రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ దఫా ఎన్నికల్లో రాజంపేట నుండి ఎంపీ సీటును సాయిప్రతాప్ ఆశించారు. కానీ ఆయనకు బదులుగా డీకే సత్యప్రభకు చంద్రబాబునాయుడు టిక్కెట్టును కేటాయించారు.
దీంతో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోకి తనను ఆహ్వానించి అవమానించారని కూడ ఆయన ఆరోపణలు చేశారు. వైసీపీలో చేరేందుకు సాయిప్రతాప్ రంగం సిద్దం చేసుకొంటున్నారని తెలుస్తోంది.
చదవండి: ఆడా మగా తేడా లేదు.. వీడు దరిద్రుడు కాదా?: ‘టీడిపీ నేత’పై షర్మిల ఘాటు…
- Advertisement -