
పాకిస్తాన్లో ఇప్పటివరకు 1,19,536 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధిత టాప్ టెన్ జాబితాలలో పాకిస్తాన్ చోటు సంపాదించుకుంది.
దీనిపై అక్కడి ప్రజలతో పాటు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇదే స్థాయిలో కరోనా విజృంభణ కొనసాగితే ఇప్పటికే కుదేలవుతున్న పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ దారుణ స్థితికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటివరకు పాకిస్తాన్లోనే అత్యధిక కేసులు నమోదైన ప్రాంతంగా 45,463 కేసులతో పంజాబ్ ప్రావిన్స్ నిలిచింది.
దాని తర్వాతి స్థానంలో 43,790 కేసులతో సింధ్ ప్రావిన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో ఆదేశ ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు షెహ్బాజ్ షరీఫ్కు కొవిడ్-19 పాజిటివ్ తేలడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేగుతోంది.
తమ అధినేతకు కరోనా సోకడంతో ఆ పార్టీకి చెందిన నేత ఖవాజా ఆసిఫ్ దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిపై స్పందించారు.
ప్రపంచంలో అత్యధికంగా కొవిడ్-19 బారిన పడిన టాప్ టెన్ దేశాల జాబితాలోకి పాకిస్తాన్ చేరిందని చెప్పారు.
ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ మూడు, నాలుగు స్థానాలకు చేరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారికి వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు.
ప్రభుత్వం ముసలి వారికంటే యువతను కాపాడడం పైనే శ్రద్ద చూపుతోంది. నా వయసు వారికి వైద్యం చేయకుండా వెలివేస్తోంది.
ఈ దేశం ప్రస్తుతం ప్రభుత్వంపై కాదు.. దేవుడి దయపైనే ఆధారపడి ఉంది’ అని ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరి కొన్ని రోజుల్లో దేశం దుస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.








