

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ బస్టాండ్ వద్ద కొందరు హిజ్రాలు దాడులకు తెగబడుతూ బీభత్సం సృష్టించారు. బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న కొందరు హిజ్రాలు.. తొలుత డబ్బుకోసం డిమాండ్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు. దీంతో కొందరు ఎందుకివ్వాలంటూ ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన హిజ్రాలు అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు.
అంతేగాక, కనిపించిన ఆడవాళ్ల బంగారు గొలుసులు లాక్కున్నారు. పురుషుల మొబైల్ ఫోన్స్, మనీ పర్సులు బలవంతంగా లాగేసుకున్నారు. ఈలోగా ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాగా, పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైనా హిజ్రాలు దాడికి దిగారు.
అంతేగాక, ఉప్పల్ ఏసీపీ గాంధీ నారాయణపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో నారాయణపై దాడిని అడ్డుకోబోయిన ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో కొంత భయానక వాతావరణం నెలకొంది.
కొందరు హిజ్రాలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించగా.. అక్కడి పూల కుండీలను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు. దీంతో అదనపు బలగాలను పిలిపించిన పోలీసులు.. పలువురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, స్థానికంగా హిజ్రాల ఆగడాలు పెరిగిపోయాయని, వారి బారినుంచి కాపాడాలంటూ స్థానికులతోపాటు దుకాణాల యజమానులు కోరుతున్నారు.
చదవండి: ఘోరం: తమ్ముడి కూతుర్ని చంపి.. రక్తం తాగిన మేనత్త! మరో ఘటనలో…








