

విజయవాడ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం మాజీ శాసనసభ్యురాలైన అల్లు భానుమతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.
1985లో విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భానుమతి శాసనసభకు ఎన్నికయ్యారు. పవన్ విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అల్లు భానుమతికి కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. భానుమతితో పాటు ఆమె మనుమడు యర్రా రఘురాజ్, విశాఖ నగర మాజీ కార్పొరేటర్ యర్రా సన్యాసినాయుడు కూడా జనసేన కండువా కప్పుకున్నారు.
జనసేన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీలో చేరానని ఈ సందర్భంగా భానుమతి తెలిపారు. కాగా, తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ రావు కూడా జనసేన పార్టీలో ఇటీవల చేరిన విషయం తెలిసిందే.
పవన్తో అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా భేటీ
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా వచ్చి పవన్ కళ్యాణ్ను కలిశారు. విజయవాడలోని ఆయన నివాసంలో ఆమె మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అమెరికాలో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు సాయం చేయాలని పవన్ ఈ సందర్భంగా కోరారు.పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు.
చదవండి: నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వండి! జనసేన టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్!








