ముంబై: ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు ఇప్పటికిప్పుడు మొదలైనవి కావు.. మన దేశంలో చాలా సంవత్సరాలుగా జరుగుతున్నవే.. కానీ, అంతకుముందు అరాకోరా జరిగితే ఇప్పుడు నూటికి ఎనభై శాతం పైగా ఇవే.
కాలం మారుతున్నా.. ప్రేమపై, ప్రేమ వివాహాలపై పరువు పడగల నీడలు మాత్రం మారడం లేదు. నడి రోడ్డుపై తెగనరకడం, విషం పెట్టి చంపడం, రౌడీల సాయంతో హతమార్చడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు.. ఎందరో మారుతీరావులు తయారవుతున్నారు.
చదవండి: హాజీపూర్ హత్యాచారాలు: సైకో శ్రీనివాస్ రెడ్డికి.. మరికొందరి సహకారం!?
కూతురు కులాంతర వివాహం చేసుకుందని మారుతీరావు ప్రణయ్ అమృతలపై దాడి చెయ్యడం.. ఆ దాడిలో ప్రణయ్ బలి కావడం తెలిసిందే.. అందరినీ విస్మయానికి గురి చేసిన ఈ ఘటన జరిగిన దగ్గర నుండి ఇలాంటివి రోజుకోకటి వింటున్నాం..
కూతురుని సజీవదహనం చేసిన తండ్రి
తాజాగా మహారాష్ట్రలో ఇటువంటి పరువు హత్యే నవ వధువు ప్రాణాలు తీసేసింది. కారణం కులాంతర వివాహమే. అల్లుణ్ణి ఇంటికి పిలిపించి మరీ కూతురితో సహా సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.
వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా నిఘోజ్ గ్రామానికి చెందిన యువతీయువకులు మంగేశ్ రణ్సింగ్ (23), రుక్మిణీ సింగ్ (19)లు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి తరఫు పెద్దలు అంగీకరించకపోవడంతో అబ్బాయి కుటుంబ సభ్యులే వివాహం చేశారు.
అమ్మాయి తరపున కేవలం తల్లి మాత్రమే పెళ్లికి హాజరయ్యింది. కొంతకాలం గడిచాక ఆలుమగల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో అమ్మాయి ఏప్రిల్ 30న పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఎప్పటి నుండో అవకాశం కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి కుటుంబ సభ్యులకు సదవకాశం దొరికింది. దీనితో మాట్లాడదాం రమ్మని అల్లుణ్ణి ఇంటికి రప్పించారు. అమ్మాయి అబ్బాయి గదిలో ఉండి మాట్లాడుకుంటూ ఉండగా తలుపులు మూసేసి వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
మంటల్లో కాలిపోతూ కేకలు పెట్టిన రుక్మిణీ, మంగేశ్ ల అరుపులు వినిపించి చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పీ వారిని పుణెలోని సస్సూన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. 70శాతం శరీరం కాలిపోవడంతో రుక్మిణీ చికిత్స పొందుతూ మరణించింది. 50శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న మంగేశ్ మాత్రం ప్రాణాలతో పోరాడుతున్నాడు.
స్థానికుల సమాచారం మేరకు వచ్చి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. చేసిందంతా చేసి పరారైన రుక్మిణి తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.