చెన్నై: కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రిలోనే తన 51వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్టు తెలుస్తోంది.
శనివారం సాయంత్రం వైద్యుల సమక్షంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలు-సావిత్రి దంపతులు తమ పెళ్లి రోజును జరుపుకున్నట్టు సమాచారం.
ఐసీయూలోనే వారు కేక్ కట్ చేసినట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే, ఆసుపత్రి వర్గాలు కానీ, బాలు తనయుడు చరణ్ కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కరోనా బారినపడిన బాలసుబ్రహ్మణ్యం గత నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించినట్టు వార్తలు వచ్చాయి.దీంతో వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందించారు.
ఎక్మో చికిత్స కూడా చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంత కుదుటపడింది. ఇటీవల చరణ్ మాట్లాడుతూ.. సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని పేర్కొన్నారు.
దాంతో బహుశా సోమవారం ఎస్పీబీ అసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవబోతున్నారేమో అని అందరూ భావించారు. కానీ అది కాదు, సోమవారం ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
అదేమిటంటే.. ఎస్పీ బాలు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. అంటే.. ఆయన ఇప్పుడు కరోనా నెగిటివ్. అయితే ఇంకా వెంటిలేటర్ సపోర్టు తీసివేయలేదని, ఫిజియో థెరపీ మాత్రం కొనసాగుతోందని చెప్పారు.
ఈ మేరకు ఎస్పీ చరణ్ సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నాన్న గారికి కరోనా నెగిటివ్గా వచ్చింది. కాకపోతే ఆయన ఊపిరితితత్తుల ఇన్ఫెక్షన్ నయం కావడానికి మరి కొద్ది కాలం పడుతుంది..’’ అని తెలిపారు.
త్వరలోనే వెంటిలేటర్ తీసేయాలని వైద్యులు భావిస్తున్నారని, ప్రస్తుతం బాలు స్పృహలోనే ఉన్నారని, స్పందిస్తున్నారని, తన ఐప్యాడ్లో ఆయన టెన్నిస్, క్రికెట్ మ్యాచ్లను చూస్తున్నారని ఆ వీడియోలో చరణ్ పేర్కొన్నారు.
View this post on Instagram