హైదరాబాద్: రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వెండితెరపై మెరవనున్నారు.
‘వకీల్ సాబ్’తో తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.
బుధవారం పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సంగీత దర్శకుడు తమన్ ఈ విషయమై ట్వీట్ కూడా చేశాడు.
టీజర్ లేదంటే సినిమాలో రెండో పాటను విడుదల చేస్తారని సమాచారం. `వకీల్ సాబ్` తర్వాత పవన్ నటించే 27వ సినిమాకు క్రిష్ దర్శకుడు.
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బుధవారం రానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది.
పవన్ 28వ సినిమా గురించి బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రకటన రాబోతోంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఆయన ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ధ్రువీకరించారు.